మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్ధి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా ఖరారు చేసింది. పాల్వాయి స్రవంతిని మునుగోడు ఉప ఎన్నికల అభ్యర్ధిగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పలువురు నేతలు పోటీ పడ్డారు. స్రవంతితో పాటు స్థానిక నేతలు పల్లె రవికుమార్, కైలాష్, చల్లమల్ల కృష్ణారెడ్డి తదితరులు టికెట్ ఆశించారు.
అశావహులు ఎక్కువ మంది ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలను సేకరించారు. టికెట్ ఆశిస్తున్న వారి బలాలు, బలహీనతలపై ఏఐసీసీకి నివేదిక పంపించారు. పాల్వాయి స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దాదాపు అయిదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా, ఒక సారి రాజ్యసభ సభ్యుడుగా సేవలు అందించారు. 2014 ఎన్నికల్లో స్రవంతి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసే 27వేలకు పైగా ఓట్లు కైవశం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, సీపీఐ అభ్యర్ధులు మూడు, నాలుగు స్థానాల్లో నిలవగా, స్రవంతిపై టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకరరెడ్డి గెలుపొందారు. ఇవన్నీ పరిశీలించిన పార్టీ అధిష్టానం పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రకటించింది.
బీజేపీ అభ్యర్ధిగా తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. దీంతో బీజేపీ ఆయననే అభ్యర్ధిగా ప్రకటించనుందనే ప్రచారం జరుగుతోంది. అధికార టీఎస్ఎస్ ఇంత వరకూ అభ్యర్ధిని ప్రకటించలేదు. కానీ అన్ని పార్టీలు నియోజకవర్గంలో ప్రచారాలను నిర్వహిస్తున్నాయి.
రికార్డు సృష్టించిన బాలాపూర్ గణేష్ లడ్డూ..వేలంలో ఈ సారి ధర ఎంత పలికింది అంటే..?