తొందరపడిన ఓ కోయిల ముందే కూసింది .. అంటే ఇదే. ఆలూ లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్న సామెత మాదిరిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి వ్యూహ, ప్రచార కమిటీని కాంగ్రెస్ నియమించింది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలో దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, అనిల్, సంపత్ సభ్యులుగా కమిటీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ ప్రకటించారు.
వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు అధికారికంగా పంపాలి. ఆ తరువాత ఆయన ఆమోదించాలి. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘంకు పంపాలి. ఆ తదుపరి కేంద్ర ఎన్నికల సంఘం ఆరు నెలలలోపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇంత తతంగం ఉంటుంది. రాజగోపాల్ రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదిస్తారా..? వెంటనే ఉప ఎన్నిక వచ్చేస్తుందా..? అనేది చూడాలి. దుబ్బాక, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఈ సారి మునుగోడు ఉప ఎన్నికల్లోనూ తమ హవా కొనసాగించాలని వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది. అధికార టీఆర్ఎస్ .. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక గెలుపు స్పూర్తిగా మునుగోడులో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది.
ఇక కాంగ్రెస్ పార్టీ ..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నుండి వెళ్లిపోవడమే కాకుండా పార్టీ ని తీవ్ర స్థాయిలో విమర్శించినందున నియోజకవర్గంలో ఆయన ఆధిపత్యాన్ని దెబ్బకొట్టి పార్టీ సత్తా చూపించాలని భావిస్తొంది. అందుకే ఇతర రాజకీయ పక్షాల కంటే ముందే స్ట్రాటజీ, ప్రచార కమిటీని నియమించింది. అయితే ఈ ప్రచార, వ్యూహ కమిటీలో పార్టీలో ఎంపిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్థానం కల్పించలేదు. చూడాలి ఎమి జరుగుతుందో. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక అంశం హాట్ టాపిక్ గా నడుస్తొంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?