Huzurabad By poll: హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ హోరాహోరీ ప్రచారం సాగిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ నుండి దాదాపుగా ఈటల రాజేందర్ బరిలో దిగనున్నారు. ఒక వేళ సమీకరణలు ఏమైనా మారితే ఈటల సతీమణి జమున పోటీ చేస్తారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇటీవల వెల్లడించారు. గుర్తు మాత్రం మారదు ఇద్దరిలో ఒకరు బరిలో ఉండబోతున్నామని జమున స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన నాటి నుండి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనకు కేసిఆర్ చేసిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరూ తనకు అండగా ఉండాలని కోరుతున్నారు. తాను రాజీనామా చేయడం వల్లనే కేసిఆర్ ప్రభుత్వం నియోజకవర్గానికి వేల కోట్లు రూపాయలు పరుస్తున్నారనీ, దళిత బంధు తీసుకువచ్చారని చెబుతున్నారు. అన్ని వర్గాల్లోని పేదల కోసం బంధు పథకాన్ని ప్రకటించాలని ఈటల డిమాండ్ చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే ఉద్యమ నేపథ్యం ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దింపింది. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావుతో సహా పలువురు మంత్రులు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. వివిధ సంఘాలకు, అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నారు. ఈటల ఓటమే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతోంది.
Huzurabad By poll: ఇంటర్వ్యూ ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ పార్టీలో జోష్ వచ్చింది. ఈటల బీజేపీలో చేరకముందు వరకూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న కౌశిక్ రెడ్డి ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిపోవడంతో కేసిఆర్ ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేయకుండా ఎమ్మెల్సీ ఇచ్చి పోటీ నుండి తప్పించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ గట్టి అభ్యర్థిని రంగంలో దించాలని భావంచి తొలుత ముగ్గురు పేర్లతో జాబితాను సిద్ధం చేసింది. కొండా సురేఖ, కృష్ణారెడ్డి, సదానంద పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర నాయకత్వం పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ కు అందజేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఆ పేర్లతో పార్టీ నేతల అభిప్రాయాలను స్వీకరించారు. అయితే ఆ పార్టీ నాయకులు స్థానికులకే టేకిట్ ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై రూటు మార్చింది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించింది. హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశక్తి ఉన్న స్థానిక నేతల నుండి అర్జీలను స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకే ఆసక్తి ఉన్న వారు ధరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ధరఖాస్తు రుసుముగా రూ.5వేలు నిర్ణయించింది. అభ్యర్థులను ఈ నెల 6వ తేదీన పార్టీ సీనియర్ల బృందం ఇంటర్వ్యూ చేస్తుంది.
బట్టి విక్రమార్క, దామోదర రాజనర్శింహ, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు వరంగల్లు డీసీసీ ప్రెసిడెంట్ నాయని రాజేందర్ రెడ్డి, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ సభ్యులుగా ఏర్పాటైన కమిటీ అభిప్రాయాలను ఏఐసీసీకి పంపిస్తారు. ఈ నెల 10వ తేదీ తర్వాత ఆ నివేదిక ఆధారంగా అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు. అయితే ఇది కొత్త విధానం ఏమీ కాదనీ గతంలోనూ ధరఖాస్తుల స్వీకరణ పక్రియ జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ పరిణామాలతో దాదాపు కొండా సురేఖకు కన్ఫర్మ్ అని ప్రచారం జరగ్గా ఆమెకు చాన్స్ లేదని స్పష్టం అవుతోంది. ఓ పక్క ఈటల వర్సెస్ కేసిఆర్ అన్న రీతిలో సాగుతున్న హూజూరాబాద్ బై పోల్ లో కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త ఎత్తుగడ ఏ మేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి మరి.
2.Nara Lokesh Vs Kanna Babu: కొడాలి నాని భాషలో లోకేష్ దండకం.. ఘాటుగా అందుకున్న వైసీపీ మంత్రి..!!
3.AP Capital: రాజధానిపై బీజేపీ చాటు రాజకీయం..! దొంగాట..? దొడ్డిదారా..!?