Corona Death: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాీజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఎంఎస్ఆర్ ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆదివారం ఎంఎస్ఆర్ ను నిమ్స్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించి ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఎంఎస్ఆర్ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై కుటుంబ సభ్యులు స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఎంఎస్ఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ, కోమాలో ఉన్నారని సోమవారం రాత్రి తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించి మంగళవారం వేకువజామున తుది శ్వాస విడిచారు. కాగా ఎంఎస్ఆర్ మృతి వార్త తెలియడంతో పలువురు నేతలు సంతాపం తెలియజేశారు.
ఎంఎస్ఆర్ ఉమ్మడి ఏపిలో కరీంనగర్ నుండి మూడు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా గెలిచారు. విద్యార్థి ఉద్యమాల ద్వారా రాజకీయాలకు ప్రవేశించిన ఎంఎస్ఆర్ తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఉమ్మడి ఏపిలో పీసీసీ అధ్యక్షుడుగా, మంత్రిగా, ఏపిఎస్ ఆర్ టీసీ చైర్మన్ గా ఎంఎస్ఆర్ బాధ్యతలు నిర్వహించారు.