Corona Effect: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనేక జాగ్రత్తలు పాటిస్తున్న ముఖ్యమంత్రులు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో కరోనా కట్టడి చర్యలపై ప్రభుత్వంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసిఆర్ కూడా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుండటం ప్రజలను, ప్రభుత్వాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మరో సారి లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గత లాక్ డౌన్ ప్రభావాల నుండి అనేక రంగాలు ఇంకా కోలుకోలేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ రోజు 20వ తేదీ రాత్రి 9గంటల నుండి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది, ప్రతి రోజు రాత్రి 9గంటల నుండి ఉదయం 5గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ నెల 30వ తేదీ వరకూ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అత్యవసర సేవలకు, అత్యవసర సేవల్లో పని చేసే వారికి నైట్ కర్ప్యూలో మినహాయింపులు ఇచ్చారు. ఇదిలా ఉండగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా ధియేటర్ ల నిర్వహణపైనా ప్రదర్శనదారులు, పంపిణీదారులు నేడు సమావేశమై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం 21వ తేదీ నుండి థియేటర్ లు మూసివేయాలని నిర్ణయించారు.
అయితే రాత్రి పూట కర్ఫ్యూ విధించడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమి లేదని కాంగ్రెస్ పెదవి విరుస్తోంది. జనసంచారం స్వల్పంగా ఉండే రాత్రి పూట కర్ఫ్యూ పెట్టడంలో ఔచిత్యం ఏమిటో, ఈ విధమైన చర్యలు కరోనా వ్యాప్తిని ఏ విదంగా నిలువరిస్తాయో అర్థం కావడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం తీసుకున్న రాత్రి పూట కర్ఫ్యూ నిర్ణయంపై ఆయన స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం తీరు ఉందని ఆయన విమర్శించారు. కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అసెంబ్లీ సమావేశాల్లో తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలపై అందరి సూచనలు సలహాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ కాకుండా పగటి పూట కర్ఫ్యూ విధించాలని భట్టి విక్రమార్క సూచించారు.