Corona For Lions: ఒక పక్క దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఎనిమిది ఆసియా సింహాలకు కరోనా బారిన పడటం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. జూపార్క్ సిబ్బంది నుండి సింహాలకు కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. మానవుల ద్వారా జంతువులకు కరోనా వచ్చే ప్రమాదం ఉందని తెలిసిన మరుసటి రోజే మొట్టమొదటి సారిగా సింహాలకు కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కల్గిస్తున్నది.
జూ పార్క్ లోని సింహాలు అనారోగ్యంతో ఉండటంతో గత నెల 24వ తేదీన నమూనాలు సేకరించిన జూ అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. తాజాగా ఆ పరీక్షల నివేదికలు వచ్చాయి. ఎనిమిది సింహలకు కరోనా వైసర్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వాటిని ఐసోలేషన్ లో ఉంచారు. వాటికి అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయంపై జూ అధికారులు మాట్లాడుతూ సింహాలు సాధారణంగానే ఉన్నాయనీ, ఆహారం తీసుకుంటున్నాయని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా జూ పార్క్ కు సందర్శకులను నిలిపివేశారు.