Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ ఇప్పిస్తామంటూ ఓ ప్రభుద్దుడు ఏకంగా ప్రముఖ సినీ నిర్మాతకే టోకరా ఇచ్చాడు. ఓ పక్క ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అయితే పలు సంస్థలు వారి వద్ద పని చేసే ఉద్యోగుల కోసం పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డోసులు కావాల్సి ఉండటంతో వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మాయమాటలు చెప్పి డబ్బులు దండుకుని మోసం చేస్తున్నారు.
ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయాన్ని తెలుసుకున్న నాగార్జునరెడ్డి అనే వ్యక్తి సురేష్ బాబు పీఏకు ఫోన్ చేసి తన వద్ద 500 డోసుల టీకాలు ఉన్నాయని నమ్మబలికాడు. తన భార్య బ్యాంకు అకౌంట్ కు లక్ష రూపాయలు ట్రాన్స్ ఫర్ చేస్తే టీకాలు అందిస్తానని నమ్మబలికాడు. ఈ విషయాన్ని సురేష్ బాబుకు పిఏ తెలియజేసి ఆయన అనుమతితో లక్ష రూపాయలను అతను చెప్పిన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశాడు. నగదు డ్రా చేసుకున్న తరువాత నాగార్జునరెడ్డి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో వీరు మోసపోయినట్లు తెలుసుకున్నారు. నాగార్జునరెడ్డిపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో సురేష్ బాబు సహాయకుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే నాగార్జునరెడ్డిని సైబరాబాద్ పోలీసులు నాలుగు రోజుల క్రితమే అరెస్టు చేశారు. ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ ప్రతినిధిని టీకాల పేరుతో మోసగించిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటిఆర్ పిఏ నంటూ నమ్మంచి ఎంటర్ టైన్మెంట్ ఛానల్ ప్రతినిధిని ఆతను మోసం చేశాడు. నాగార్జునరెడ్డి అసలు పేరు నాగేంద్రబాబుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నాగేంద్రబాబుపై ఆరు కేసులు నమోదు అయ్యాయి. సైబరాబాద్ లో మూడు కేసులు, హైదరాబాద్ లో రెండు కేసులు, విజయవాడలో ఒక కేసు నమోదైంది. గతంలో ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడాడు. అదే విధంగా ఎయిర్ టెల్ ప్రైవేటు నంబర్లు ఇప్పిస్తానని కూడా నాగేంద్రబాబు మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నాగార్జునరెడ్డి అలియాస్ నాగేంద్రబాబు ప్రస్తుతం సంగారెడ్డి జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.