Munugode Bypoll: ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరా హోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితం రేపు తేలనుంది. కౌంటింగ్ కు సంబంధించి నల్లగొండ జిల్లా కేంద్రంలోని అర్జాల బావి వద్ద గోడౌన్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేపు (ఆదివారం) ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తి అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పరిశీలకులు, ఏజంట్ల సమక్షంలో 7.30 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ను తెరుస్తారు. ఆ తర్వాత 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.
కౌంటింగ్ కేంద్రంలో 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 15 రౌండ్ లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల నుండి వచ్చిన ఈవీఎం బాక్సులను రౌండ్ కు 21 పోలింగ్ కేంద్రాల ఈవీఎం ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ముందుగా 686 పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ లో పూర్తి అయి ఉదయం 9 గంటల సమయానికి ఆ ఫలితం వెల్లడి అవుతుంది.
మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను రేపింది. ఎన్నికల ఫలితంపై బెట్టింగ్ లు కూడా బాగా జరుగుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అభ్యర్ధి గెలుపు, మెజార్టీల పైనా బెట్టింగ్ లు జరుగుతున్నాయని అంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు మొత్తం 47 మంది ఎన్నికల బరిలో ఉండగా, ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకు గానూ 2,25,192 మంది (93.13శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం మద్యాహ్నానికి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయి విజేత ఎవరో తెలిపోతుంది.