తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరిన వివాదాలను చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం దూతగా వచ్చిన ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ .. సీనియర్ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చేలా కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. పీసీసీ కమిటీ పదవుల నియామకాల్లో వలస నేతలకు ప్రాధాన్యత ఇచ్చారనీ, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్శింహా, జగ్గారెడ్డి తదితర నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం, ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి రేవంత్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం తెలిసిందే. ఈ పరిణామంతో పీసీసీ కమిటీలో పదవులు పొందిన 12 మంది తమ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలంగా క్రమశిక్షణతో పని చేస్తుంటే ఇప్పటికీ వలస నాయకులు అని సంభోధించడం ఏమిటని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం దూతగా హైదరాబాద్ గాంధీ భవన్ (కాంగ్రెస్ పార్టీ కార్యాలయం) కు చేరుకున్న దిగ్విజయ్ సింగ్ నిన్న సుదీర్ఘంగా దాదాపు పది గంటల పాటు నేతలతో విడివిడిగా భేటీ అయి చర్చించారు. ఈ సందర్భంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి నేతలకు దిశానిర్దేశం చేశారు.
దిగ్విజయ్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సీనియర్లు, జూనియర్ లు అంటూ ఉండరని అన్నారు. పార్టీ నేతలు సంయమనం పాటించాలనీ, ఏవైనా సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగానే చర్చించుకోవాలన్నారు. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవద్దనీ, ఎంత పెద్ద నాయకులైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చుకోవాలన్నారు. పార్టీ నేతలు అందరూ ఐక్యంగా పని చేయాలని సూచించారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తనను కలిసారనీ, చిన్న వయసు లో ఉన్న వారికి పీసీసీ ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు. సీనియర్ లను కాదని కొత్త వారికి పీసీసీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ నేతలు అందరూ ప్రజా క్షేత్రంలో ఉండాలని సూచించారు. పార్టీలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.
ఇదే సందర్భంలో బీఆర్ఎస్, బీజేపీలపైనా విమర్శలు చేశారు దిగ్విజయ్ సింగ్. కేంద్రం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. మోడీ పాలన లో మధ్య తరగతి ప్రజలు నలిగిపోతున్నారని అన్నారు. ఈ స్థాయిలో ధరలు పెరుగుదల ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని చెప్పారు. దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిందన్నారు. మోడీ సర్కార్ కార్పోరేట్ సంస్థలకే వత్తాసు పలుకుతోందని విమర్శించారు. ప్రత్యర్ధులపై ప్రభుత్వ సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారనీ, మనుషుల మధ్య ద్వేషాలను పెంచుతున్నారని విమర్శించారు. జోడో యాత్రను ఉడ్డుకోవడానికి కేంద్రం కుట్రలు చేస్తొందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలే తెలంగాణను సాధించారా అని ప్రశ్నించారు. ప్రజలకు అచ్చిన హామీ మేరకు తెలంగాణ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసిఆర్ విస్మరించారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసిఆర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలను బెదిరిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. బీజేపీకి మద్దతు పలికేందుకే బీఆర్ఎస్ ఏర్పాటు చేశారన్నారు. మైనార్టీల అభివృద్దికి కాంగ్రెస్ కృషి చేసిందన్నారు. తెలంగాణలో మైనార్టీ రిజర్వే,న్లపై ఓవైసీ ఎందుకు మాట్లాడటం లేదు. కేసిఆర్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు దిగ్విజయ్ సింద్. బీజేపీని గెలిపించేందుకు ఒవైసీపీ పార్టీ వివిధ రాష్ట్రాల్లో పోటీ చేస్తొందని ఆయన ఆరోపించారు.
దిగ్విజయ్ సింగ్ ఉండగానే కాంగ్రెస్ నేతల బాహాబాహీ.. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత