Eatala Rajender: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైయ్యారు. దీంతో తన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రజా దీవెన పేరుతో ఈటల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తన పాదయాత్రలో భాగంగా 12వ రోజు ఈటల హుజూరాబాద్ నియోజకవర్గంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర కొనసాగుతుండగా వీణవంక మండలం కొండపాక వద్ద ఈటల స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. నడవలేని స్థితిలో ఉండటంతో పాదయాత్రను నిలిపివేశారు. వైద్యులను పిలిపించి పరీక్షలు నిర్వహించగా తీవ్ర జ్వరం ఉండటంతో పాటు లోబీపీ, షుగర్ లెవల్స్ పెరగడాన్ని గమనించారు. ఆక్సిజన్ లెవల్స్ కూడా పడిపోవడంతో వెంటనే పాదయాత్ర నిలిపివేసి హైదరాబాద్ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు.
వైద్యుల సూచనల మేరకు ఈటలను హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈటల పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా పడటంతో ఈటల రాజేందర్ కు బదులు ఆయన సతీమణి జమున పాదయాత్ర కొనసాగించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈటల అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ.. ఈటల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈటల రాజేందర్ ఈ నెల 19వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపురం మండలం నుండి ప్రజా దీవెన పాదయాత్రను ప్రారంభించారు. నేటి వరకూ 222 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగింది.