Eatela Rajendar : టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కు కాలం కలిసి రావడం లేనట్లుగా ఉంది. ఆయన వ్యాఖ్యలు అనుకోకుండా వివాదం రూపు దాల్చుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీ అంతర్గత పరిణామాలపై చేసిన వ్యాఖ్యలే మంటలు పుట్టించగా తాజాగా తన శాఖకు సంబంధించిన వాటి విషయంలోనూ ఇరుకున పడ్డారు ఈటల. ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తే ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
Eatela Rajendar ఈటల ఏమన్నారంటే…
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తూ.. ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహించే వారిని విధుల నుంచి తొలగిస్తేనే సిబ్బంది కొరత సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. తెలంగాణలో ఎక్కడ కూడా వైద్యుల కొరత లేదన్న ఆయన.. వైద్య కళాశాలల అనుబంధ దవాఖానాల్లో వైద్యులు తగినంత మంది ఉన్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్యులు చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన ఆయన.. అలాంటి వారిని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.. వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామన్నారు.. రాష్ట్రంలో ఏడాదికి 4,750 మంది డాక్టర్లు బయటకు వస్తున్నారని తెలిపారు మంత్రి ఈటల.. అయితే.. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారమే రేగుతోంది.
ఈటలపై ఫైరయింది ఎవరో తెలుసా?
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్లను తెలంగాణ మెడికల్ జాక్ తప్పుబట్టింది. ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసుకోవచ్చని ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా జీవో ఇప్పించారని తెలంగాణ ప్రభుత్వ మెడికల్ జేఏసీ చైర్మన్ డా. రమేష్ గుర్తుచేశారు. చట్టంలో ప్రైవేట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఉన్నప్పుడు.. మంత్రి అందుకు విరుద్ధంగా మాట్లాడటం సరికాదన్నారు . అసెంబ్లీలో మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్లో వైద్యం చేస్తున్నారని.. అలా చేస్తున్న వారిని తొలగిస్తామంటూ మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.