Eatela Rajendar: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ మాజీ సహచరుడు ఈటల రాజేందర్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. భూకబ్జా ఆరోపణలతో అనూహ్య రీతిలో మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్ ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ సైతం అయ్యారు. ఈటల రాజేందర్ పై మరో మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అవుతూ వస్తున్నారు. తాజాగా ఆయన మరిన్ని కీలక కామెంట్లు చేశారు.
ఇదీ జరిగింది…
ఈటల రాజేందర్ ఎపిసోడ్లో ఏం జరిగిందనేది మంత్రి గుంగుల ఆసక్తికరంగా వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈటెల రాజేందర్ మీద ప్రజలు ఫిర్యాదులు చేశారని పేర్కొన్న మంత్రి గంగుల కమలాకర్ వెంటనే ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించి ఆరోపణలు నిజమని తేలడంతో ఈటెలను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేశారని తెలిపారు. ఈ పరిణామంతో పాటుగా 15 రోజులుగా తెలంగాణలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని మంత్రి వివరించారు. ఈటల తీరుతో హుజురాబాద్ నాయకులు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటున్నారని తెలిపారు. అయితే, వారిని డబ్బులు ఇచ్చి టీఆర్ఎస్ నేతలు కొంటున్నారు అని ఈటల రాజేందర్ విమర్శించడం బాధాకరమన్నారు.
ఎవ్వరూ అమ్ముడు పోరు…
టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికైన పలువురు ప్రజా ప్రతినిధులు అమ్ముడుపోయారు అని ఈటల రాజేందర్ ఆరోపించడం బాధ కలిగించిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గులాబీ పార్టీ తరపున గెలిచిన వారు ఎవ్వరు అమ్మడు పోరని మంత్రి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలతో ఈటల సమావేశం వళ్ల టిఆర్ఎస్ హుజురాబాద్ నేతలు అయోమయంలో పడ్డారని పేర్కొన్న మంత్రి గంగుల అందుకే వారు ఈటలను వదిలి టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని పేర్కొన్నారని వివరించారు. కేసీఆర్ బొమ్మతో తాము గెలిచినందున టీఆర్ఎస్ వెంటే ఉంటామని ఆయా నేతలు చెప్తున్నార మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తనకు వర్గం ఉండదని పేర్కొన్న గంగుల కమలాకర్ అంతా టీఆర్ఎస్ వర్గమేనని వ్యాఖ్యానించారు.