Eatela Rajendar: తన మంత్రివర్గ మాజీ సహచరుడు ఈటల రాజేందర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా చుక్కలు చూపిస్తున్నారా? భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ ను అనూహ్య రీతిలో టార్గెట్ చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ఆయన అనుచరులపై అధికారులు పాత కేసులు తిరగతోడుతున్నారు. ఈటలకు సన్నిహితంగా ఉండే అధికారులను సైతం టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ముందుగా పోలీస్ పెద్దాయన…
మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కు అనుకూలంగా ఉంటున్నాడనే కారణంతో హుజురాబాద్ ఏసీపీగా ఉన్న సుందరగిరి శ్రీనివాస్ ను బదిలీ చేసి డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పరిణామం హాట్ టాపిక్ గామారింది. హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్ రావు పై వేటు అనంతరం ఈటల అనుచరుల మీద వేటు వేశారని అంటున్నారు.
ఈటల అనుచరుడిపై వేటు
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలబాక గ్రామానికి చెందిన మాజీ సింగల్ విండో చైర్మన్ (ప్రస్తుత జడ్పీటీసీ) మాడ వనమాల భర్త సాధవరెడ్డికి కేడీసీసీ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఆయన ప్రాథమిక సహకార సంఘం చైర్మన్గా ఉన్నప్పుడు ఎరువులు, నిధులు దుర్వినియోగం చేయడంతో రూ. 18 లక్షల అవినీతి జరిగిందంటూ కేడీసీసీ బ్యాంకు 2017లో ఆయనకు నోటిసులు జారీ చేసింది. ఆ కేసుకు సంబంధించి సాధవరెడ్డి అదే సమయంలో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయితే సాధవరెడ్డికి మాజీ మంత్రి ఈటల రాజేందర్తో సన్నిహిత సంబంధాలున్నాయి. కాగా.. మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్ను తొలగించడంతో.. సాధవరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అందువల్లే తనకు నోటీసులు మళ్లీ పంపించారని సాధవరెడ్డి అంటున్నారు.