Eatela Rajendar: టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరుతున్నందున నైతికతకు కట్టుబడి ఎమ్మెల్యే పదవిని వదులుకున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కునేందుకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తన ఇలాకాలో ప్రజలతో మమేకం అవుతూ తన వాదనలను వినిపిస్తున్నారు. అయితే, తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. “మీరు చట్టానికి లోబడి పని చేస్తున్నారా.. చుట్టానికి లోబడి పని చేస్తున్నారా“ అంటూ విరుచుకుపడ్డారు.
Read More: Eatela Rajendar: కేసీఆర్పై కొత్త ఆరోపణలు చేసిన ఈటల
కేసీఆర్ ప్రగతిభవన్ గురించి…
తాను రాజీనామా చేసిన తర్వాత ప్రగతి భవన్ వీడి కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక వర్గాల ప్రజలపై కొత్తగా సీఎంకు ప్రేమ పుట్టుకొస్తోందన్నారు. తాను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నపుడు వైద్యం ఉచితంగా అందించాలని కోరినా.. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. తాను బయటికి వచ్చిన తరవాత ఇప్పుడు సీఎం వచ్చి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు కట్టిస్తామని హామీ ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే తమకు పుట్టగతులుండవని సీఎం కేసీఆర్కు ఇప్పుడు తెలిసొచ్చిందని ఈటల విమర్శించారు.
Read More: Revanth Reddy: అప్పుడే గ్రూపు రాజకీయాలు చేస్తున్న రేవంత్
అవాక్కయ్యే ప్రశ్న వేసిన ఈటల
ప్రస్తుతం హుజూరాబాద్ కు వస్తున్న మంత్రులు నిధులు, ఇండ్లు ఇస్తామని చెప్తున్నారని.. మరి రాష్ట్రం అంతటా ఎందుకు ఇవ్వరని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్లు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో మాత్రమే కట్టి ఇచ్చారని, మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు నిర్మించలేదని ఈటల ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలైనా చెప్పి గెలవాలనేదే కేసీఆర్ నైజమన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని, కర్రుకాల్చి వాత పెడతారని అన్నారు. ఈటల రాజేందర్ గెలిస్తే, ధర్మం గెలుస్తుందని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల నుంచి తనను విడదీయలేరని పేర్కొన్నారు. సీఎం చెప్పిందే వేదం తప్ప, మంత్రుల అభిప్రాయాలకు విలువ లేదన్నారు.