తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్)ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆమోదం తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ .. పార్టీ అధినేత కేసిఆర్ కు లేఖ రాసింది. దాదాపు రెండు నెలల క్రితం మునుగోడు ఉప ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పార్టీ ని బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ అధినేత కేసిఆర్.. సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. జాతీయ పార్టీగా పేరు మార్చిన తర్వాత సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని, కేసిఆర్ లేఖను అక్టోబర్ 5న కేంద్ర ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు అందజేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రొసీజర్ ప్రకారం పార్టీ పేరుపై అభ్యంతరాలు కొరుతూ నెల రోజుల సమయం ఇచ్చారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ని బీఆర్ఎస్ గా మార్చుకునేందుకు అనుమతి ఇస్తూ సీఈసీ లేఖ రాసింది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిపికేషన్ విడుదల చేయడంతో టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ గా మారింది.
కేంద్ర ఎన్నికల సంఘం నుండి పార్టీ మార్పుపై ఆమోదం లభించడంతో రేపు (9వ తేదీ) శుక్రవారం మధ్యాహ్నం 1.:20 గంటల శుభ ముహూర్తంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలనీ, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో రేపు ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖకు సమాధానంగా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా లేఖ పంపుతారు కేసిఆర్. అనంతరం సీఎం కేసిఆర్ బిఆర్ఎస్ జండాను ఆవిష్కరించి, పతాకావిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ విజ్ఞప్తి చేశారు.