YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ అందించింది. భారత ఎన్నికల సంఘం నుండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేడు అధికారిక గుర్తింపు లభించింది. పార్టీకి అధికారికంగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో రేపు (గురువారం) ఉదయం 10.30 గంటలకు లోటస్ పాండ్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. విషయంలోకి వెళితే తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా గత ఏడాది వైఎస్ షర్మిల రాజకీయ పార్టీని అనౌన్స్ చేశారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నాడు పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ప్రకటించి పార్టీ ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున నిర్వహించారు.
YS Sharmila: వైఎస్ఆర్ టీపీకి అధికారిక గుర్తింపు
అప్పటి నుండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు వైఎస్ షర్మిల. అయితే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ఆర్ టీపీ పేరు తమ పార్టీ పోలి ఉందంటూ ఎన్నికల సంఘానికి గత నవంబర్ నెలలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు స్వీకరించిన కేంద్రం ఎన్నికల సంఘం వైఎస్ఆర్ టీపీ గుర్తింపు ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంటూ ఈ ఏడాది జనవరి నెలలో లేఖ రాసింది. మరో పక్క షర్మిల తల్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల సంఘానికి తమకు అభ్యంతరం లేదంటూ లేఖ అందించారు. వైఎస్ఆర్ టీపీ పేరును ఖరారు చేయించే దిశగా ఆ పార్టీ బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బుధవారం కేంద్రం ఎన్నికల సంఘం నుండి వైఎస్ఆర్ టీపీకి అధికారిక గుర్తింపు లభిస్తూ లేఖ అందింది.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల కోసం పని చేస్తా
ఈ సందర్భంగా అందుబాటులో పార్టీ ముఖ్యనేతల సమక్షంలో వైఎస్ షర్మిల కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భర్త బ్రదర్ అనిల్, తల్లి వైఎస్ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పార్టీకి అధికారిక గుర్తింపు ఇచ్చిన భారత ఎన్నికల సంఘానికి వైఎస్ షర్మిల కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సేవే ధ్యేయంగా, ప్రజాస్వామ్య బద్దంగా చివరి వరకూ మా పార్టీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల కోసం పని చేస్తామని, ప్రజల మధ్యనే ఉంటామని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ బాటలోనే పయనిస్తామని పేర్కొన్న వైఎస్ షర్మిల, జై తెలంగాణ..జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు.