టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో సారి షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.80.66 కోట్లను జప్తు చేసింది. షెల్ కంపెనీల ద్వారా బ్యాంకులను మోసం చేశారన్న అభియోగంపై విచారణ జరుపుతున్న ఈడీ ఇంతకు ముందు నామాకు సంబంధించిన మధుకాన్ సంస్థలకు చెందిన రూ.96.21 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.తాజగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మధుకాన్ గ్రూపు ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్, ఖమ్మం, ఏపిలోని ప్రకాశం జిల్లాలో 28 స్థిరాస్తులను జప్తు చేసింది.
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నుండి జంషేడ్ పూర్ వరకూ 163 కిలో మీటర్ల మేర నాలుగు లైన్ ల రోడ్డు నిర్మాణానికి నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థ 2011 లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ ఏఐ) నుండి కాంట్రాక్ట్ పొందింది. ఈ రహదారి నిర్మాణం కోసం కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుండి రూ.1050 కోట్లు రుణం తీసుకుంది. అయితే నిర్ణీత సమయంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడంతో పాటు 50.24 శాతం మాత్రమే పనులు చేసి చేతులు ఎత్తేసింది. ఈ నేపథ్యంలో సీబీఐకి ఎన్ హెచ్ ఏఐ ఫిర్యాదు చేసింది. రోడ్డు నిర్మాణానికి 90 శాతం మేర రుణం పొంది పనులు ఆపేసిందని ఫిర్యాదులో పేర్కొనగా 2019 లో మధుకాన్ సంస్థ పై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు ఆధారంగా మనీల్యాండరింగ్ ఆరోపణ నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది.
రాంచీ ఎక్స్ ప్రెస్ వేస్ లిమిటెడ్ అనే అనుబంధ కంపెనీ ద్వారా రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని నామా నాగేశ్వరరావు, కంపెనీ ప్రమోటర్లు నామా సీతయ్య, శ్రీనివాసరావు, నామా పృధ్వీతేజ లు కుట్ర పూరితంగా ఆరు షెల్ (డొల్ల) కంపెనీలు ఏర్పాటు చేసి తమ ఇతర ప్రాజెక్టులోకి నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. గత ఏడాది జూన్ నెలలో మధుకాన్ చైర్మన్ నామా నాగేశ్వరరావు కార్యాలయం, నివాసం, కంపెనీ డైరెక్టర్ ల నివాసాల్లో ఈడీ సోదాలు జరిపింది. నామా నివాసంలో రూ.34 లక్షల నగదుతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది ఈడీ. రుణం సొమ్మును షెల్ కంపెనీలకు ఇతర మార్గాల ద్వారా దారి మళ్లించినట్లు గుర్తించిన ఈడీ ..గతంలో హైదరాబాద్, పశ్చిమ బెంగాల్ లో ఉన్న రూీ.88.85 కోట్ల విలువైన స్థిరాస్తులతో పాటు విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఉన్న రూ.7.36 కోట్ల చరాస్తులను అటాచ్ చేసింది. తాజాాగా రూ.80.66 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. సుమారు రూ.361.92 కోట్లు నేరుగా మళ్లించినట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది.