బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. టాలివుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నెల 19వ తేదీన విచారణకు హజరుకావాలని ఈడీ అధికారులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసుకు సంబంధించి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు దారుడుగా ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రీసెంట్ గా బెంగళూరు డ్రగ్స్ కేసును రీఓపెన్ చేస్తే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో పైలట్ రోహిత్ రెడ్డికి ఈటీ నుండి నోటీసులు అందడం తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది.
ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పందించారు. తనకు ఈడీ నుండి నోటీసులు అందాయని తెలిపారు. తన అధార్, ఓటర్ ఐడీతో పాటు వ్యాపార ఆర్ధిక లావాదేవీ వివరాలు తీసుకురావాలని అడిగారని చెప్పారు. 19న విచారణకు హజరు అవుతానని తెలిపారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో రోహిత్ రెడ్డి న్యాయనిపుణులతోనూ ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అసలు విషయానికి వెళితే 2021 ఫిబ్రవరి లో కర్ణాటక రాజధాని బెంగళూరులో శంకర గౌడ ఇచ్చిన పార్టీకి పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు హజరయ్యారు. ఆ పార్టీకి రియల్టర్ సందీప్ రెడ్డి, హీరో తనీష్ కూడా పాల్గొన్నారు.
నాటి పార్టీలో నాలుగు కోట్ల విలువైన డ్రగ్స్ ఉపయోగించారని పోలీసులకు సమాచారం అందింది. ఈ పార్టీకి సంబంధించి ఇద్దరు నైజీరియన్ లను ఫిబ్రవరి 26న కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. అయితే పట్టుబడిన డ్రగ్స్ తో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని బెంగళూరు పోలీసుల అనుమానిస్తున్నారు. భారీగా నగదు చేతులు మారిన నేపథ్యంలో కేసును పోలీసులు ఈడీకి అప్పగించారు. దీంతో రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే రోహిత్ రెడ్డి కి జారీ చేసిన నోటీసులో ఏ కేసులో విచారణకు హజరు కావాలనేది పేర్కొనలేదని, కేవలం ఆర్ధిక లావాదేవేల వివరాలతో విచారణకు హజరు కావాలని కోరినట్లుగా తెలుస్తొంది.