Breaking: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక పర్యాయం సీబీఐ కేసులో నిందితుల నివాసాలు, కార్యాలయాలపై తనిఖీలు నిర్వహించిన ఈడీ బృందాలు నేడు మరో సారి రంగంలోకి దిగాయి. ఢిల్లీ సహా అయిదు రాష్ట్రాల్లో ఏకకాలంలో 40 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రాంతంలోని ఈ సారి 25 ప్రదేశాల్లో ఈడీ సోదాలు నిర్వహించడం తీవ్ర సంచలనం అయ్యింది. గతంలో టీఆర్ఎస్ ఎమెల్సీ కవిత పీఏ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు నేడు కవిత అకౌంటెంట్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కవితకు ఈడీ నోటీసులు పంపింది. ప్రస్తుతం ఆమె కరోనా బారిన పడి హోమ్ క్వారంటైన్ లో ఉండటంతో కవిత సహాయకులకు ఈడీ నోటీసులు అందజేసింది.
లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అదికారులు హైదరాబాద్ లోని పలువురు లిక్కర్ వ్యాపారులు, చార్టెడ్ అకౌంటెంట్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితకు గతంలో అకౌంటెంట్ గా పని చేసిన గోరంట్ల బుచ్చిబాబు, పిఏగా పని చేసిన అభినవ్ రెడ్డి నివాసంలోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. వీరి నివాసాల్లో ఈడీ సోదాలు జరపడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
హైదరాబాద్ లో అభినవ్ రెడ్డి, అభిషేక్, ప్రేమ్ సాగర్ రావు, పిళ్లే నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. గచ్చిబౌలి, నానక్ రామ్ గుడ, కోకాపేట, దోమలగూడ, ఇందిరా పార్క్ సమీపంలోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ బీజేపీ నేతలు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ కు లిక్కర్ స్కామ్ లో లింక్ లు ఉన్నాయని, వాటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఆ ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని తెలియజేశారు. వారు మీడియా సమావేశంలో మాట్లాడిన 24 గంటల వ్యవధిలోనే ఈడీ బృందాలు హైదరాబాద్ లో సోదాలు జరపడం గమనార్హం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?