సోమవారం రాత్రి సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జ్ భవనంలోని ఎలక్ట్రికల్ బైక్ షో రూమ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరి ఆడక లాడ్జీలో వసతి పొందుతున్న ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో అయిదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. మరో పది మంది గాయపడ్డారు. మృతుల్లో విజయవాడకు చెందిన ఏ హరీష్, చెన్నైకి చెందిన సీతారామన్, ఢిల్లీకి చెందిన వీతేంద్ర ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది.
రూబీ లాడ్జి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్ షో రూమ్ నుండి మంటలు ఎగిసిపడటంతో దట్టంగా పొగ వ్యాపించింది. దట్టమైన పొగ వ్యాపించడం లాడ్జీ లో ఉన్న వారు ఊపిరి ఆడక ప్రమాదం బారిన పడ్డారు. పలువురు లాడ్జి గదుల్లో, మరి కొందరు ఆవరణలో స్పృహ తప్పి పడిపోయారు. క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లాడ్జీలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు 25 మంది వరకూ ఉన్నట్లు తెలుస్తొంది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్ లోని సిబ్బంది, పర్యాటకులు ఏమి జరుగుతుందో తెలియక ఆందోళనకు గురై హాహా కారాలు చేశారు. కొందరు తమ ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కిందకి దూకి తీవ్రంగా గాయపడ్డారు. అగ్ని మాపక అధికారులు హైడ్రాలిక్ క్రేన్ సహయంతో లాడ్జీలో చిక్కుకున్న వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.
కాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. విషయం తెలిసిన వెంటనే మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ను దగ్గర ఉండి పర్యవేక్షించారు. క్షతగాత్రులను గాంధీ, యశోదా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు వారు తెలిపారు. నగర సీపీ ఆనంద్, అగ్ని మాపక శాఖ అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్, డీసీపీ చందనా దీప్తి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Breaking: సికింద్రాబాద్ బైక్ షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం