Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. అభ్యర్ధులు, పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు సీఇఓ వికాస్ రాజ్ తెలిపారు. 199 మంది మైక్రో అబ్జర్వర్లు, రెండు జీఎస్టీ టీమ్ లు నియమించినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ తనిఖీల ద్వారా రూ.6.8 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు ఉండగా, 80 ఏళ్లు దాటిన ఓటర్లు 2,576 మంది ఉన్నారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 5,686 మంది ఉండగా, కేవలం 739 మంది మాత్రమే ధరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వృద్ధులు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నికలకు మొత్తం 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, వీటిలో అర్బన్ పరిధిలో 35, రూరల్ పరిధిలో 263 ఉన్నాయని వికాస్ రాజ్ తెలిపారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి తొలిసారిగా డిజిటల్ ఓటరు కార్డులు మంజూరు చేశామని వెల్లడించారు. ఇప్పటికే ఓటరు స్లిప్ లను పంపిణీ చేశామనీ, ఆన్ లైన్ లోనూ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గురువారం (3వ తేదీ) ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందన్నారు. మాక్ పోలింగ్ దృష్ట్యా గంట ముందుగానే ఏజంట్లు రావాలని ఆయన సూచించారు.
మునుగోడు నియోజకవర్గ వ్యాపితంగా రేపు సాయంత్రం 6 గంటల తర్వాత విస్తృత తనిఖీలు చేపడతామని, బయట నుండి వచ్చిన వారు నియోజకవర్గంలో ఉండకూడదని ఆయన తెలిపారు. ఎస్ఎస్ఎం లపైనా నిషేదం ఉందని చెప్పారు. ఇందుకు అనుగుణంగా నెట్ వర్క్ ప్రొవైడర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రేపు ఆరు గంటల తర్వాత సోషల్ మీడియాలోనూ ప్రచారాలు చేయకూడదని తెలిపారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.