Etela Rajender: భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు సీఎం కేసిఆర్ మరో షాక్ ఇచ్చారు. ఈటెలపై ఆరోపణలు రావడంతో ఆయన వివరణ కూడా తీసుకోకుండా విచారణకు ఆదేశించి షాక్ ఇచ్చిన కేసిఆర్ ఆ విచారణ పూర్తి స్థాయి నివేదక రాక ముందే మరో షాక్ ఇచ్చారు. ఈటెల నుండి వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కేసిఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసిఆర్ సూచనల మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈటెల నుండి వైద్య ఆరోగ్య శాఖను కేసిఆర్ కు బదిలీ చేయడంతో ఈటెల శాఖ లేని మంత్రిగా మారిపోయారు.
అయితే ఈటెల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు దాదాపు నిజమేనని విజిలెన్స్, రెవెన్యూ అదికారుల ప్రాధమిక విచారణలో తేలినట్లు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఏసీబీ డీజీ లు సంబంధిత విచారణ నివేదికను సీఎం కేసిఆర్ కు అందజేయనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఈటెలను సీఎం కేసిఆర్ రాజీనామా చేయమని కోరే అవకాశం ఉంది. అయితే కేసిఆర్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం నేపథ్యంలో ఈటెలే స్వయంగా రాజీనామా చేయవచ్చని ఊహగానాలు వినిపిస్తున్నాయి. నిన్ననే ఈటెల మీడియాతో మాట్లాడుతూ ఆత్మగౌరవం కంటే మంత్రి పదవి గొప్పది కాదని అన్నారు. శాఖను తొలగించిన తరువాత ఆత్మగౌరవాన్ని చంపుకుని ఈటెల శాఖలేని మంత్రిగా కొనసాగే అవకాశం లేదని నిన్న ఆయన మాట్లాడిన మాటలను బట్టి తెలుస్తోంది.