Etela Rajender: హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో ధర్మానికి, అధర్మానికి సంగ్రామం జరుగుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అనంతరం తొలి సారిగా ఈటల నేడు నియోజకవర్గంలో పర్యటించారు. శంభునిపల్లి నుండి కమలాపూర్ వరకూ పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ అనాడు సింహగర్జనకు కరీంనగర్ ఎలా తొలి పలుకు పలికిందో నేడు హుజూరాబాద్ కూడా ఆత్మగౌరవ పౌరాటానికి, అణగారిని వర్గాల హక్కుల కోసం ఉద్యమ క్షేత్రంగా మారనుందని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ కు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 19 ఏళ్ల పాటు గులాబీ జెండాను, తెలంగాణ ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటే నేడు తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని, కష్టకాలంలో అండగా ఉన్న నాలాంటి వారిని కేసిఆర్ ద్రోహం చేస్తున్నారని నియోజకవర్గ కార్యకర్తలు అందరూ అంటున్నారన్నారు. అక్రమంగా సంపాదించుకున్న వందల కోట్ల ను వాడుకుకుంటూ కొందరు నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గొర్ల మందల మీద తోడేళ్లు పడ్డట్టుగా తన మద్దతుదారులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసినా, దాడులు చేసినా తనకు మద్దతు ఇచ్చే వారిని కొనలేరని ఈటల స్పష్టం చేశారు.
Read More: Anandaiah medicine: ఏపి సీఎం వైఎస్ జగన్కు ఆనందయ్య లేఖ..! మేటర్ ఏమిటంటే..!!
ఈ నియోజకవర్గంలో జరిగే సంగ్రామం కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలా ఉంటుందని ఈటల పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నేడు భంగపడిన వారంతా రేపు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరుగుతారని అన్నారు. కొందరు వ్యక్తులు నేడు టీఆర్ఎస్ తొత్తులుగా, బానిసలుగా మారిపోయి నా మద్దతుదారులు, ప్రజలపై ఆరోపణలు చేస్తూ అవమానిస్తున్నారని రాజకీయంగా వారిని బొంద పెడతామని హెచ్చరించారు. హుజూరాబాద్ నుంచే మళ్లీ కొత్త శకం ప్రారంభం అవుతుందన్నారు. అడుగడుగునా ఆశీర్వదించిన మహిళలకు, కార్యకర్తలు, మద్దతుదారులకు ఈటల కృతజ్ఞతలు తెలియజేశారు.