CM KCR: ఇటీవల జాతీయ పార్టీ బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్శింహులుకు సీఎం కేసిఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారా ? ఆయనకు కేసిఆర్ సర్కార్ లో కీలక పదవి రానున్నదా ? అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకు బలమైన ఆధారాలు కూడా కనబడుతున్నాయి. తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం కేసిఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చిన క్రమంలో తొలుత ఏర్పాటు చేసిన సమావేశానికి నాడు బీజేపీలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులులు కేసిఆర్ యే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. దీంతో ఆయన పార్టీ నేతలతో సంప్రదింపులు జరపకుండానే కేసిఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి హజరైయ్యారు. దీంతో అప్పట్లోనే మోత్కుపల్లి బీజేపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరతారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత కొద్ది రోజులకే బీజేపీలో అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పార్టీపై అసంతృప్తిగా ఉన్న మోత్కుపల్లి బీజేపీకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కేసిఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకంపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ పథకాన్ని తీసుకువచ్చిన సీఎం కేసిఆర్ ను అభినవ అంబేద్కర్ అంటూ కీర్తించారు. దళితుల అభ్యున్నతికి ఇంత వరకూ ఏ నాయకుడు ఇటువంటి పథకాన్ని తీసుకురాలేదనీ, ఈ పథకాన్ని తీసుకువచ్చిన కేసిఆర్ కు పార్టీలకు అతీతంగా నేతలందరూ కేసిఆర్ కు, ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ విధంగా మోత్కుపల్లి మాట్లాడటంతో ఆయన టీఆర్ఎస్ లో చేరితే కేసిఆర్ సర్కార్ లో కీలక పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. దళిత బంధు పథకానికి చట్టబద్దత కల్పించి, ఆ పథకం అమలునకు చైర్మన్ గా మోత్కుపల్లిని నియమించాలని కేసిఆర్ భావిస్తున్నారనీ, ఆ పదవికి కేబినెట్ ర్యాంక్ కూడా ఇస్తారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా సోమవారం దళిత బంధు పథకంపై ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మోత్కుపల్లికి సీఎం కేసిఆర్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది.
మోత్కుపల్లి మంచి వాగ్దాటి ఉన్న దళిత నాయకుడు, మాజీ మంత్రియే కానీ ప్రస్తుతం ప్రజా ప్రతినిధి కాదు. అయినప్పటికీ కేసిఆర్ మంత్రులు, అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలను కాదని తన పక్కన మోత్కుపల్లికి ప్రాధాన్యత కల్పించారు. సీఎం కేసిఆర్ కు ఓ పక్కన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మరో పక్క మోత్కుపల్లి నర్శింహులు సమావేశంలో కూర్చున్నారు. ఇంతటి ప్రెయారిటీ మోత్కుపల్లికి కేసిఆర్ ఇచ్చారు అంటే త్వరలో కీలక పదవి ఖాయమనే మాట వినబడుతోంది.