Huzurabad By Poll: బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. చాలా కాలం నుండి కేసిఆర్ తనను ఆహ్వానిస్తున్నారని తెలిపారు పెద్దిరెడ్డి. మంత్రి వర్గం నుండి తొలగించినా ఈటల ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా కొనసాగి ఉంటే ఉప ఎన్నిక వచ్చేది కాదన్నారు. నియోజకవర్గ అభివృద్ది, ప్రజలు శ్రేయస్సు కోసమే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అధికార టీఆర్ఎస్ గెలిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని, ఈటల గెలిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రజలు నష్టపోతారని చెప్పుకొచ్చారు.
ఎటువంటి హామీ లేకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాననీ, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా కార్యకర్తగా పని చేస్తానని అన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపునకు కృషి చేస్తానని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. టికెట్ కమిట్మెంట్ తో పార్టీలో చేరడం లేదనీ, బీజేపీలో ఇమడలేకనే టీఆర్ఎస్ లో చేరుతున్నానని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విధానపరమైన విషయాల్లో అధికార పక్షంపై విమర్శలు చేయడం జరుగుతుందన్నారు. బీజేపీ పట్ల తనకు ఎటువంటి ద్వేష భావం లేదనీ, జాతీయ పార్టీగా గౌరవిస్తామని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే అధికార పార్టీ అభ్యర్థే గెలవాలని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామని చెప్పారు. ఈటల గెలిస్తే అధికార పార్టీపై గెలిచాననే ఈగో శాటిస్ఫై అవుతుంది తప్ప నియోజకవర్గానికి జరిగే ప్రయోజనం ఉండదని అన్నారు.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన నాటి నుండి అసంతృప్తిగా ఉన్న పెద్దిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నిన్న పార్టీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డి నాడు కేసిఆర్ కు సహచరుడుగా ఉన్నారు. త్వరలో హుజారాబాద్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.