ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే పలువురు ప్రముఖులు అరెస్టు అయ్యారు. తాజాగా ఢిల్లీ డిప్యూటి సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను కూడా సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ సీఎం కేసిఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవితను అధికారులు విచారించారు. ఆ లిక్కర్ స్కామ్ కేసులో వరుసగా ప్రముఖులు, వ్యాపారవేత్తలు అరెస్టు అవుతున్న నేపథ్యంలో బీజేపీ నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .. కవితను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపో మాపో అరెస్టు అవుతారని వ్యాఖ్యానించారు.
కోమటిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మునుగోడు ఉప ఎన్నికల్లో బయటపడిందని అన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్ .. బీఆర్ఎస్ అయ్యిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ బీజేపీపై అసత్య ప్రచారం చేశారని కోమటిరెడ్డి మండిపడ్డారు. ప్రజలు కేసిఆర్ అసత్య ప్రచారాన్ని నమ్మలేదని అన్నారు. రాష్ట్రంలో కేసిఆర్ పాలన పోయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయంగా తనను ఎదుర్కొనలేక తాను అమ్ముడు పోయానంటూ కేటిఆర్, రేవంత్ రెడ్డి కలిసి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి సాక్షిగా తాను ఎవరికీ అమ్ముడుపోలేదని చెబుతున్నానన్నారు. తాను అవినీతి చేసి ఉంటే కేసిఆర్, రేవంత్ రెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొద్ది నెలల క్రితం ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .. బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్ధిగా మునుగోడు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పుడే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆయనకు కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇచ్చిందని, అందుకే ఆయన బీజేపీలో చేరారంటూ ప్రత్యర్ధులు ప్రచారం చేశారు.
GIS: పెట్టుబడిదారులకు ఏపి సర్కార్ రెడ్ కార్పెట్ ..పారిశ్రామిక వేత్తలకు అభినందనలు తెలిపిన సీఎం జగన్