మునుగోడు ఉప ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ కు నర్సయ్య గౌడ్ పంపించారు. 2013 లో టీఆర్ఎస్ లో చేరిన బూర నర్సయ్య గౌడ్.. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుండి పోటీ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై 30వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల (5వేలు) తేడాతో పరాజయం పాలైయ్యారు. అయితే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిత్వాన్ని బూర నర్సయ్య గౌడ్ ఆశించారు. పార్టీ కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రకటించడంతో బూర నర్సయ్య అసంతృప్తికి గురయ్యారు.
ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ ఆయనతో మాట్లాడిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్ధి విజయం కోసం కృషి చేస్తానని బూర నర్సయ్య తెలిపారు. ఇదే క్రమంలో అసంతృప్తితో ఉన్న బూర నర్సయ్యను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. మునుగోడు నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఉన్న గౌడ సామాజికవర్గం ఓట్లను ఆకర్షించేందుకు బూర నర్సయ్యతో చర్చలు జరపడంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. నిన్న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చర్చలు జరిపి ఆయన సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది.
టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సందర్భంగా బూర నర్సయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తనను సంప్రదించకుండా మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్ధిని ఎంపిక చేశారన్నారు. వ్యక్తిగతంగా పార్టీలో అవమానానికి గురైనట్లు పేర్కొన్నారు. ఆత్మగౌరవ సభలకు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణలో బీసీలు వివక్షతకు గురి అవుతున్నారని అన్నారు.