Dk Aruna: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక దాదాపు ఖరారు అయిన సంగతి తెలిసిందే. నాలుగైదు రోజుల్లో ఈటల బీజెపీలో చేరనున్నారు. ఈ లోపుగా టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నారు.పార్టీతో పాటు పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరితే ఇతర పార్టీలు విమర్శించే అవకాశం ఉండదు. నైతిక విలువలకు కట్టుబడి ఉన్నట్లు అవుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క మాజీ ఎంపి, పారిశ్రామిక వేత్త కొండా విశ్వేశ్వరరెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించడానికి అడుగులు పడ్డాయి. కొద్దికాలం క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వశ్వరరెడ్డి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేరు. తొలుత విశ్వేశ్వరరెడ్డి పార్టీ పెట్టే అలోచన చేస్తున్నారని వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో ఇటీవల కొండ విశ్వశ్వరరెడ్డి రెండు మూడు పర్యాయాలు ఈటల రాజేందర్ తో భేటీ అయ్యారు. దీంతో వీరంతా కలిసి రాజకీయ పార్టీ పెడతారనే ఊహాగాలు వచ్చాయి. తొలుత బీజేపీ చేరిక వార్తలను ఖండించిన ఈటల రాజేందర్ కొద్ది రోజుల వ్యవధిలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈటల చేరికతో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డిని కూడా పార్టీలో చేర్చుకుంటే పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావించిన ఆ పార్టీ నేతలు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ గురువారం కొండా విశ్వేశ్వరరెడ్డితో భేటీ అయ్యారు. డీకే అరుణ ఫామ్ హౌస్ లో వీరు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డిని డీకె అరుణ బీజేపీకి రావాలని ఆహ్వానించారు. దీనికి కొండా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని డీకే అరుణ కొండాను కోరారు. ఈటల రాజేందర్ కలిసి విశ్వేశ్వరరెడ్డి కాషాయం కండువా కప్పుకుంటారా లేక ఆ తరువాత ప్రత్యేకంగా పార్టీలో చేరతారా అనేది తేలాల్సి ఉంది.