Konda Visveswar Reddy : తెలంగాణలో ఇప్పటికే కొత్త పార్టీ ఏర్పాటుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల అడుగులు వేస్తోంది. వైఎస్ఆర్ అభిమానులతో విస్తృత సమావేశాలను నిర్వహిస్తూ కొద్ది రోజుల్లో పార్టీ ప్రకటన చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో ఇటీవలే కాంగ్రేస్ పార్టీకి రాజీనామా చేసిన ఓ మాజీ ఎంపి కొత్త రాజకీయ పార్టీ అంటూ తన మనసులో మాట చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నది.
కొంత కాలం క్రితం వరకూ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపి రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టనున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న రేవంత్ రెడ్డి.. ప్రాంతీయ పార్టీ అంటూ ఇంత వరకు బయట ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి..తన భవిష్యత్తు రాజకీయ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టాలా, లేక మరో పార్టీలో చేరాలా లేక స్వతంత్రంగా ఉండాలా అనే విషయంపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. రెండు, మూడు నెలల పాటు అందరినీ కలిసి అభిప్రాయాలను తెలుసుకుంటానని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సమయంలోనే విశ్వేశ్వరరెడ్డి ఓ బీజేపీ నేతతో మంతనాలు జరపడంతో బీజేపీలో చేరనున్నారంటూ వార్తలు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇక లాభం లేదు అనుకుంటున్న పలువురు నాయకులు మాత్రం దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో ఆ పార్టీలో చేరుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్రంలోనూ ఇప్పుడిప్పుడే బలాన్ని పుంజుకుంటుండటంతో బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ గుటికి చేరతారా లేక సొంత పార్టీ పెడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. విశ్వేశ్వరరావు చెప్పిన దాని ప్రకారం చూసుకంటే ఆయన నిర్ణయం తెలియాలంటే మరో మూడు నెలల పాటు ఆగాల్సిందే.