Family suicide Case: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ముగ్గురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. తొలుత ప్రాధమిక సమాచారంతో ఆత్మహత్యగా పోలీసులు భావించారు. అయితే ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ జరిపిన తనిఖీలో కీలక పత్రాలు, సూసైడ్ నోట్ లభించడంతో కొత్తగూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
Family suicide Case: ముగ్గురు సజీవ దహనం
వివరాల్లోకి వెళితే.. పాత పాల్వంచ తూర్పు బజారులో నివాసంలో ఉండే రామకృష్ణ ఇంట్లో గ్యాస్ లీకేజీ కారణంగా రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులతో సహా వారి కుమార్తె సాహిత్య (12) సజీవ దహనం అయ్యారు. మంటల అంటుకొన్న మరో కుమార్తె సాహితికి తీవ్ర గాయాలు కాగా పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో ప్రధమ చికిత్స అనంతరం భద్రాద్రి కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి సాహితికి 80 శాతం కాలిన గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. తొలుత ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. అయితే పోలీసులకు అందిన ప్రాధమిక సమాచారం ఆధారంగా ఆత్మహత్యగా భావించి దర్యాప్తు ప్రారంభించారు.
ఎమ్మెల్యే కుమారుడు పరారీ
క్లూస్ టీమ్ బృందం రామకృష్ణ కారును తనిఖీ చేయగా కీలక పత్రాలు, పలు బిల్లులతో పాటు రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్ దొరికాయి. తమ చావుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర కూడా కారణమని మృతుడు రామకృష్ణ సూసైడ్ నోట్ లో పేర్కొనడంతో..పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం రాఘవేంద్ర పరారీలో ఉన్నాడనీ, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఏఎస్పీ రోహిత్ మీడియాకు తెలిపారు.