Suicide: హైదరాబాద్ చందానగర్ లో విషాదం చోటుచేసుకుంది. వారికి ఏమి కష్టం వచ్చిందో ఏమో.. ! పాపం.. తమ ఇద్దరు పిల్లలను చంపేసి వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ చందానగర్ లో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చందానగర్ లోని రాజీవ్ గృహకల్పలో ఏడు సంవత్సరాలుగా నాగరాజు దంపతులు నివాసం ఉంటున్నారు. ఆర్ధిక ఇబ్బందులో లేక కుటుంబ కలహాలో తెలియదు కానీ ఇద్దరు పిల్లలతో సహా వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. గత శుక్రవారం నుండి నాగరాజు ఇంట్లో నుండి ఎవరూ బయటకు రాలేదు. ఈ రోజు ఆతని ఇంటి నుండి దుర్వాసన రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఈ రోజు ఉదయం అతని ఇంటి తలుపులు తట్టారు. లోపల గడియపెట్టి ఉండి ఎవరూ పలకకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూసి అందరూ నిర్ఘాంతపోయారు. లోపలతో ఇద్దరు పిల్లలతో సహా నాగరాజు అతని భార్య విగతజీవులుగా పడి ఉన్నారు.
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్నారు. మృతులు నాగరాజు, అతని భార్య సుజాత, పిల్లలు రమ్యశ్రీ, టిల్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరిలించే ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు కారణంగానే వీరు బలన్మరణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. వీరి మరణాలపై వారి బంధువుల కు పోలీసులు సమాచారం అందించారు. పోలీసు దర్యాప్తులో వారి బలవన్మరణానికి కారణాలు తెలిసే అవకాశం ఉంది, ఈ ఘటన తో రాజీవ్ గృహ కల్పన కాలనీలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. పరిసర ప్రాంతాలకు చెందిన వారు అందరూ ఈ ఘటనపైనే చర్చించుకుంటున్నారు.