బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి పాదయాత్ర ప్రవేశించడంతో స్థానిక బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా కాలుస్తూ కార్యకర్తలు బండి సంజయ్ ను మండలంలోకి ఆహ్వానించారు. అనంతరం బండి సంజయ్ తన ప్రసంగంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఏవరికీ సీఎం కేసిఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ ఉన్న కొంత మంది టీఆర్ఎస్ శ్రేణులు.. బీజేపీ కార్యకర్తలతో వాదనకు దిగారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిందని టీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీసారు.
ఈ తరుణంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరసర్పం దాడులకు పాల్పడ్డారు. ఒకరికి ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బండి సంజయ్ .. పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ల దాడి చేస్తుంటే సీపీ ఏమి చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు.
అక్కడ నుండే నేరుగా డీజీపీ కి ఫోన్ చేసిన బండి సంజయ్ .. పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం ఇంకా ఆరు నెలలు మాత్రమే ఉంటుందన్నారు. బీజేపీ కార్యకర్తల తలలు పగులగొడుతుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. గాయపడిన ఇద్దరు కార్యకర్తలను డీజీపీ కార్యాలయానికి తీసుకువస్తానన్నారు. కేసిఆర్ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన బండి సంజయ్ .. ఎలాంటి ఘర్షణలు లేకుండా పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సహకరించాలని డిమాండ్ చేశారు. కేసిఆర్ పాలన రాజకార్ల పాలనను తలపిస్తొందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.