Fire Accident: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పరిధిలోని నల్లగుట్ట వద్ద గల డెక్కన్ నైట్ వేర్ స్టోర్స్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణం నుండి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భవనం లోపల నుండి పేలుడు శబ్దాలు వినిపిస్తుండటంతో పరిసర ప్రాంతాల వారిలో ఆందోళన నెలకొంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో దుకాణంలో ఉన్న వస్తువులు పూర్తి గా కాలిపోయాయి. భవనం మూడు అంతస్తుల వరకూ మంటలు వ్యాపించాయి.
భవనం గ్రౌండ్ ప్లోర్ లో ఉన్న బట్టల కు మంటలు అంటుకుని భారీగా మంటలు ఎగిసిపడుతున్నయి. భారీ క్రేన్ సహాయంతో ఫైర్ సిబ్బంది భవనం అద్దాలను పగులగొట్టి లోపల భారీగా అలుముకున్న పొగను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. భవనం లోపల చిక్కుకున్న నలుగురుని ఫైర్ సిబ్బంది కాపాడారు. లోపల ఉన్న మరో ఇద్దరిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంటలు పక్కనే ఉన్న మరో భవనానికి వ్యాపించారు. దీంతో మొత్తం 12 ఫైర్ ఇంజన్ లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను కంట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ దట్టమైన పొగ వల్ల మంటలను అదుపు చేయడం ఫైర్ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. లోపల బట్టల సరుకు ఎక్కువగా ఉండటంతో మంటలు అదుపు చేయడం కష్టమవుతోంది. నిబంధనలకు విరుద్దంగా తయారీ యూనిట్ ఇక్కడ ఏర్పాటు చేయడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో అనుమతులు లేకుండా జనావాసాల్లో నడుస్తున్న తయారీ యూనిట్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.
మరో పక్క మంటలు అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బందిలో ఇద్దరు తీవ్రమైన పొగ వల్ల అస్వస్థతకు గురైయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మంటల ధాటికి భవనం కూలిపోతుందని స్థానికులు భయపడుతున్నారు. ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఫైర్ సిబ్బంది నలుగురు వ్యక్తులను కాపాడారని, మరో ఇద్దరు లోపల ఉన్నట్లు తెలుస్తొందన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. అంత పెద్ద ఎత్తున స్టాక్ అనుమతులు లేకుండా సోర్ట్స్ లో పెట్టడంపై ఆరా తీస్తున్నామన్నారు. వివరాలు తెలుసుకోవాలంటే స్టోర్స్ యజమాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందిందన్నారు. మరో రెండు గంటల్లో మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు.