TSRTC: ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్ధులను ప్రత్యేక విమానాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు విమానాల్లో 1500 మందికిపైగా విద్యార్ధులు ఇండియాకు చేరుకున్నారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ గగనతలాన్ని నిషేదించడంతో సరిహద్దు దేశాల నుండి భారత విద్యార్ధులను ఇండియాకు చేరవేసే కార్యక్రమం కొనసాగుతోంది. భారత విద్యార్ధులను తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పలువురు కేంద్ర మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. ఈ మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు చేరుకుని విద్యార్ధుల తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
Read More: Ukraine Russia War: ఉక్రెయిన్ల మనసు గెలుచుకున్న హర్యానా విద్యార్ధిని ..మేటర్ ఏమిటంటే..?
TSRTC: టీఎస్ఆర్ టీసీ కీలక ప్రకటన
ఈ తరుణంలో హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్ధుల కోసం టీఎస్ఆర్ టీసీ కీలక ప్రకటన చేసింది. విద్యార్ధులు వారి వారి స్వస్థలాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఎంజీబీఎస్, జేబీఎస్ చేరుకున్న విద్యార్ధులు కానీ, మార్గమధ్యంలో ఎక్కిన వారు కానీ ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. అయితే తాము ఉక్రెయిన్ నుండి వచ్చినట్లుగా విద్యార్ధుల వద్ద తగిన ఆధారం చూపించాల్సి ఉంటుందని ఆర్టీసీ వివరించింది. సురక్షితంగా ఇండియాకు చేరుకుంటున్న విద్యార్ధినీ విద్యార్ధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.