Gang Rape Case: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై రాజకీయంగా దుమారం రేగుతోంది. పబ్ వద్ద పరిచమైన ఓ మైనర్ బాలికను కారులో తీసుకువెళ్లి ఇద్దరు యువకులు, మరో ముగ్గురు మైనర్ లు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర సంచలనం అయ్యింది. గత నెల 28వ తేదీన ఈ ఘటన జరగ్గా బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు 31వ తేదీన కేసు నమోదు చేశారు. నిందితులు రాజకీయ పలుకుబడి ఉన్న నేతల కుమారులు కావడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేయడంతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు నిందితులకు సంబంధించి పలు ఆధారాలు మీడియాకు చూపి పోలీసు దర్యాప్తు తీరుపై మండిపడ్డారు. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా ఆ అయిదుగురు సామూహిక అత్యాచారం జరిపిన కారును పోలీసులు గుర్తించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Gang Rape Case: సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలి
ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్ల ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది. పోలీసులు మాత్రం ఇప్పటి వరకూ ముగ్గురినే అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. నిందితులుగా ఉన్న ఇద్దరు మైనర్ లు, ఒక యువకుడు మాలిక్ ను ఈ రోజు ఉస్మానియా లో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హజరుపర్చనున్నారు. ఈ రోజు కర్ణాటకలో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది, వారిలో ఇద్దరిని రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. వీరిని రేపు న్యాయమూర్తి ఎదుట హజరు పరిచే అవకాశం ఉందని తెలుస్తొంది. అయితే పోలీసు దర్యాప్తు తీరు పట్ల బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తన వద్ద ఉన్న ఆధారాలను దర్యాప్తు సంస్థకు అందజేస్తానన్నారు. నిందితుల్లో టీఆర్ఎస్, ఎంఐఎం నేతల కుమారులు ఉండటం వల్ల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందరావు, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రేణుకా చౌదరి తదితర పార్టీల నేతలు ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
జరిగింది ఏమిటంటే.. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36లోని అమ్నీషియా పబ్ లో గత నెల 28న మధ్యాహ్నం ఒంటి గంటి గంట నుండి సాయంత్రం 6 గంటల వరకూ ఓ బృందం పార్టీ చేసుకుంది. ఇందులో సుమారు 150మంది పాల్గొన్నారు. వీరిలో 80 శాతం మంది మైనర్లే. వీరిలో ఒక బాలిక పబ్ లో పరిచయమైన స్నేహితులతో సరదాగా గడిపింది. సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో అయిదుగురు యువకులు ఆ బాలికను బెంజ్ కారులో ఎక్కించుకుని ఓ బేకరీ వద్దకు వద్దకు వెళ్లారు. ఆ తరువాత ఆ బాలికను వేరే కారులో ఇంటి వద్ద దింపుతామని ఇన్నోవా కారులో ఎక్కించుకుని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు బాధితురాలిని పబ్ వద్ద దింపేసి వెళ్లిపోయారు. ఈ బాలిక కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా రాత్రి 9 గంటల ప్రాంతంలో తండ్రికి ఫోన్ చేసింది. ఆయన పబ్ వద్దకు వెళ్లి కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లాడు. మెడపై గాయాలు గుర్తించి ఆమెను తండ్రి ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. అనుమానంతో తండ్రి మే 31న జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ బాధితురాలు ఇచ్చిన వ్యాంగ్మూలం ఆధారంగా పోక్సో చట్టంతో సహా సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేశారు. అయితే అత్యాచార ఘటనకు సంబంధించి ఆధారాలు లభించకుండా నిందితులు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వివిధ ప్రాంతాల్లోని సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు.