Ghmc By Election: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. అదికార టీఆర్ఎస్ మద్దతు ఇస్తే ఉప ఎన్నికలో గెలుపు నల్లేరుమీద నడకే అనుకున్న బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ బలం మూడుకు చేరింది. లింగోజిగూడ డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికలలో బీజెపి అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన ఆకుల రమేష్ అకాల మరణంతో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.
దివంగత కార్పోరేటర్ రమేష్ కుటుంబ సభ్యులు, బీజేపీ ముఖ్య నేతలు ఈ డివిజన్ ఉప ఎన్నిక సందర్భంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ను కలిసి టీఆర్ఎస్ నుండి పోటీ పెట్టవద్దని కోరారు. వారి విజ్ఞప్తి పై టిఆర్ఎస్ పోటీకి ఎవరినీ నిలపలేదు. అయితే ఈ డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ తో సహా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీ అభ్యర్థిగా మందుగుల అఖిల్ పవన్ గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థిగా రాజశేఖరరెెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నాగార్జున, ఫర్వేజ్ లు పోటీ చేశారు. సోమవారం ఓట్ల లెక్కింపు నిర్వహించగా బిజేపీ అభ్యర్థి పై కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖరరెడ్డి ఘన విజయం సాధించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజెపీ…నేడు ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఈ పరిణామంతో ఆ పార్టీ వర్గాలు విస్మయానికి గురి అవుతుండగా, కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చినట్లు అయ్యింది.