గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలు వెల్లడై నెల రోజులు దాటుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో బీజెపీ కార్పోరేటర్లు మంగళవారం ప్రభుత్వం తక్షణం జీహెచ్ఎంసీ నూతన పాలవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం క్యాంప్ (ప్రగతిభవన్) కార్యాలయాన్ని ముట్టడించారు.
తాము కార్పోరేటర్లుగా గెలిచినా తమ వార్డుల్లో పనులు చేయలేకపోతున్నామనీ, ఇంకా పాత కార్పోరేటర్లే అధికారాన్ని చెలాయిస్తున్నారనీ బీజెపీ కార్పోరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ ఎదుట రోడ్డుపై నూతనంగా ఎన్నికైన బీజెపీ కార్పోరేటర్ లు భైటాయించి నిరసన తెలియజేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన నిర్వహిస్తున్న కార్పోరేటర్ లను అక్కడ నుండి తరలించారు. తొలుత బీజెపీ కార్పోరేటర్ లు అందరూ హరిత ప్లాజాలో సమావేశమైయ్యారు. సమావేశం అనంతరం ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరి వచ్చి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇటీవలే బీజేపీ కార్పోరేటర్ లు గవర్నర్ తమిళిసైని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.