గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. గత ఏడాది డిసెంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయకపోవడంపై గెలిచిన బీజెపీ కార్పోరేటర్ లు ఇటీవల ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ 150 డివిజన్ ల నుండి విజయం సాధించిన వారి పేర్లను గెజిట్ లో పొందుపరిచింది. నేటి తేదీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పార్థసారధి గెజిట్ ను జారీ చేశారు. 150 డివిజన్ ల నుండి విజయం సాధించిన అభ్యర్థులు, పార్టీ, రిజర్వేషన్ తదితర వివరాలను గెజిట్ లో పేర్కొన్నారు.
ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం ఫిబ్రవరి 11వ తేదీ వరకూ ఉంది. మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక కోసం కొత్త పాలకమండలి మొదటి సమావేశం తేదీని ప్రకటిస్తూ మరో నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. తొలి పాలక మండలి సమావేశంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటి మేయర్ల ఎన్నిక జరుగుతుంది. ఇటీవలి ఎన్నికల్లో టిఆర్ఎస్ 56, బిజెపి 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లలో లింగోజిగుడ వార్డు నుంచి ఎన్నికైన బిజెపికి చెందిన అకులా రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయకుండా అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూశారు.