Kaushik Reddy: ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హుజారాబాద్ నేత కౌశిక్ రెడ్డి బుధవారం సీఎం కేసిఆర్ ఆద్వర్యంలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కౌశిక్ రెడ్డిని సీఎం కేసిఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇంత వరకూ అంతా బాగానే ఉన్నా, కౌశిక్ రెడ్డికి మాత్రం జీహెచ్ఎంసీ భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ నాయకుడికి వేయనంత పెద్ద మొత్తంలో కౌశిక్ రెడ్డికి జరిమానా విధించి జీహెచ్ఎంసీ తమకు అందరూ సమానమేనని నిరూపించారు.
Read More: Mamata Banerjee: బీజేపీని అధికారం నుండి దించే వరకూ “ఆట ఆగదు” అంటూ గర్జించిన బెంగాల్ దీదీ
విషయంలోకి వెళితే.. అధికార పార్టీలో చేరుతున్నాము కదా అడిగేది ఎవరు అనుకున్నారో ఏమో కానీ.. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా గచ్చిబౌలి నుండి టీఆర్ఎస్ భవన్ వరకూ భారీ ఎత్తున హోల్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహానగరంలో దాదాపు 20 కిలో మీటర్ల మేర వేలాది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంగళవారం ఏర్పాటు చేయగా బుధవారం సాయంత్రం వరకూ ఈ ఫ్లెక్సీలు, హోల్డింగ్స్ ఉన్నాయి. అయితే వీటిపై పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెళ్లాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు నెటిజన్ లు సోషల్ మీడియా వేదికగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు, ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుండి జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ సదరు ఫ్లెక్సీలు, హోల్డింగ్ తొలగించే పని ప్రారంభించింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లేక్సీలు ఏర్పాటు చేసినందుకు కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ రూ.5.60 లక్షలు జరిమానా విధించింది.
గురువారం కూడా మరి కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పరిశీలించి జరిమానా విధించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకూ జీహెచ్ఎంసి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం ఇదే ప్రధమమని తెలుస్తోంది. గతంలో పది వేలు, 20వేలు, లక్ష వరకూ మాత్రమే జరిమానాలు వసూలు చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన తొలి రోజునే కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ షాక్ ఇస్తూ ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం విశేషం. ఇంతకు ముందు టీ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు కొద్ది గంటల్లోనే తొలగించారు. అయితే కౌశిక్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బుధవారం సాయంత్రం వరకూ ఉంచడంతో జీహెచ్ఎంసీ అధికారుల తీరును తప్పుబడుతూ నెటిజన్, విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీంతో జీహెచ్ఎంసీ తీవ్రంగా స్పందించింది.