Gone Prakasa Rao: రామోజీ ఫిల్మ్సిటీ నిర్మాణాలపై గతం నుండి అనేక ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిర్భావానికి ముందు కేసిఆర్ సైతం తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. అయితే ఆ తరువాత వాటి నుండి ఎవరు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసిఆర్ కు లేఖ రాయడం తీవ్ర సంచలనం అయ్యింది. రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన ఆరోపణలు చేసే గోనె ప్రకాశరావు తాజాగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం విశేషం.
అసైన్డ్ భూముల్లో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం, ప్రభుత్వ రహదారుల ఆక్రమణ, పేదలకు కేటాయించిన భూముల్లోకి వారిని అనుమతించకపోవడంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని గోనె ప్రకాశరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసిఆర్ కు లేఖ రాస్తూ తాను దర్యాప్తు సంస్థ ముందు హజరై ఈ అక్రమాలు అన్నింటినీ నిరూపిస్తానని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను నిరూపించలేకపోతే తాను దేశం విడిచి శాశ్వతంగా వెళ్లిపోతానని కూడా సవాల్ చేశారు గోనె ప్రకాశరావు.
అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తే సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో స్థానిక రైతుల నుండి ఆ భూములను 99 సంవత్సరాలకు లీజు కు తీసుకున్నట్లు రాయించుకుని అటు రైతులను ఇటు ప్రభుత్వాన్ని రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం మోసగిస్తోందని ఆయన ఆరోపించారు. గోనె ప్రకాశరావు ఆరోపణలపై అటు కేసిఆర్, ఇటు ఆర్ఎఫ్సీ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.