Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ హుజూరాబాద్ పై దృష్టి సారించాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేలుతున్నాయి. నియోజకవర్గంలో నేతలు ఇప్పటి నుండి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల కాలం వరకూ ఈటల వర్సెస్ టీఆర్ఎస్ అనుకుంటుండగా టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ లో జోష్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తుంది.
తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరనుండటంతో బీఎస్పీ తరపున ఆయన రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ ఈటలకు ఉప ఎన్నికల్లో గట్టిగా సమాధానం చెప్పి తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేదు, కేసిఆర్ కు ఎదురులేదు అని నిరూపించేందుకు సర్వశక్తులు వడ్డుతోంది. ఈ క్రమంలోనే వేల కోట్ల రూపాయలతో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపడుతోంది. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రేషన్ కార్డులు, పెన్షన్లు తదితర పథకాలకు అర్జీలను స్వీకరించడంతో పాటు పెద్ద ఎత్తున నిధులను నియోజకవర్గంలో అభివృద్ధికి కేటాయిస్తోంది.
ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు హుజూరాబాద్ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సంఘానికి లేఖ రాసి సంచలనానికి తెర తీశారు. హూజూరాబాద్ లో ఉప ఎన్నికలు తొందరగా నిర్వహించాలని లేకుంటే టీఆర్ఎస్ పార్టీ కోట్లాది రూపాయలను నియోజకవర్గంలో ఖర్చు చేస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని, పోలీసుల సహయంతో ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతోందని లేఖలో గోనె పేర్కొన్నారు. ఎన్నికలు నిస్పక్షపాతం జరగాలంటే పారా మిలటరీ బలగాల పర్యవేక్షణలో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గోనెల కోరారు. అదే విధంగా ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల వ్యవహారంపై కూడా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని గోనెల విజ్ఞప్తి చేశారు.