Breaking: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్టు చేసి ఆయనను చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఆయనకు హైకోర్టు ఆయనపై పీడీ యాక్ట్ ను ఎత్తివేస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగస్టు 25న ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
రాజాసింగ్ పై పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సతీమణి ఉషాభాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్ లలో వందకు పైగా కేసులు నమోదయ్యాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలుచేస్తూ సమాజంలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు,. ఆ మేరకు ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేశారు ఏజి. రాజాసింగ్ తరపున న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపించారు. పీడీ చట్టం కింద నమోదైన కేసులను కొట్టివేస్తూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను రవిచందర్ ప్రస్తావించారు. మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ రోజు తీర్పు వెల్లడించింది.
రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేస్తూ షరతులను విధించింది ధర్మాసనం. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు పేర్కొంది. అదే విధంగా జైలు నుండి విడుదల అయ్యే సమయంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని కూడా షరతు విధించింది. అలానే మూడు నెలల పాటు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేయవద్దని ఆదేశించింది. తక్షణం రాజాసింగ్ ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 40 రోజులుగా రాజాసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు.