Governor Tamilisai: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ల మధ్య మనస్పర్ధలు తారా స్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించడంపై పలు సందేహాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా నేడు రాజ్ భవన్ వేదికగా జరిగిన ఉగాది వేడుకలకు సీఎం కేసిఆర్ తో సహా మంత్రులు, టీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ ప్రగతి భవన్ కు ఆహ్వానం పంపినట్లు సమాచారం. మరో పక్క వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, గవర్నర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఫ్లెక్సీలో కేసిఆర్ ఫోటో కనిపించలేదు. వీటికి తోడు గవర్నర్ తమిళి సై తన ప్రసంగంలో సంచలన కామెంట్స్ చేశారు. ఈ పరిణామాలతో సీఎం కేసిఆర్, తమిళి సై ల మధ్య గ్యాప్ బాగా పెరిగాయన్న మాటలు వినబడుతున్నాయి.
Governor Tamilisai: ఎలాంటి ఇగో లేదు అందరినీ ఆహ్వానించా
రాజ్ భవన్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందనరావు, ఈటెల రాజేందర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శినం మొగులయ్య, పలువురు న్యాయమూర్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి రాజ్ భవన్ లో ఉగాది వేడుకలకు అందరినీ ఆహ్వానించినట్లు తెలిపారు. తనకు ఎలాంటి ఇగో లేదని అన్నారు. తన ఆహ్వానం మేరకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
వచ్చే నెల నుండి రాజ్ భవన్ లో ప్రజా దర్బార్
ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, అప్యాయంగా ఉండాలనీ, కలిసి తెలంగాణను ముందుకు తీసుకువెళ్దాం అంటూ వ్యాఖ్యానించారు. ఫ్రెండ్లీ గవర్నర్ రాజ్ భవన్ లో ఉన్నారని అన్న ఆమె.. నేను స్ట్రాంగ్ పర్సన్ ని. నెేను ఎవరికీ లొంగను అని అన్నారు. గవర్నర్ గా రాజ్ భవన్ లిమిటేషన్స్ నాకు తెలుసు, ఉత్ర్పేరకంగా పని చేస్తాను, వచ్చే నెల నుండి రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నేను ఎనర్జిటిక్ పర్సన్ ని, తెలంగాణ ప్రజలను ప్రేమిస్తాను. గవర్నర్ హోదాలో నా పరిమితలు తెలుసు, నన్ను ఎవరూ నియంత్రించలేరు అంటూ తమిళి సై వ్యాఖ్యానించారు. గవర్నర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.