Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మరోమారు వార్తల్లో నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ అనే పేరొందిన ఆయన తాజాగా ఇప్పుడు పార్టీ పరిపాలన విషయంలో వస్తున్న విమర్శలను ఎదుర్కునేందుకు సైతం అదే రోల్ పోషించాల్సి వస్తోందని ఇది ఆయనకు కొత్త బాధ్యతలు అప్పగించేందుకు చిహ్నమని పలువురు అంటున్నారు. ఇదంతా త్వరలో ఆరోగ్య శాఖను మంత్రి హరీశ్రావుకు అప్పగించే అవకాశాలున్నట్లు వివిధ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం.
ఈటల రాజేందర్ వల్ల…
ఈటల రాజేందర్ను కేబినెట్నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచీ సీఎం కేసీఆరే ఆ శాఖను చూస్తున్నారు. ఈటల బర్తరఫ్ తరువాత ఆరోగ్యశాఖను చూస్తున్న సీఎం కేసీఆర్.. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై వరుసగా సమీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసుకునే నిర్ణయాల అమలుతో పాటు చేపట్టాల్సిన చర్యల పర్యవేక్షణను హరీశ్రావుకు కేసీఆర్ అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న హరీశ్రావుకు త్వరలో హెల్త్ పోర్టుఫోలియో కూడా అప్పగించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
ఇదే కారణం…
కొంతకాలంగా సొంత నియోజకవర్గానికి పరిమితమైన హరీశ్.. ఇప్పుడు ఆరోగ్య శాఖ పనుల్లో బిజీగా ఉంటున్నారు. వరుసగా సీఎం నిర్వహిస్తున్న హెల్త్ రివ్యూ మీటింగ్లన్నింటిలో ఆయన పాల్గొంటున్నారు. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వివిధ రాష్ట్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ రాష్ట్రం తరఫున హరీశ్ అటెండయ్యారు. రివ్యూలో నిర్ణయాల అమలుతో పాటు చేపట్టాల్సిన చర్యల పర్యవేక్షణను హరీశ్రావుకు కేసీఆర్ అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు గవర్నర్ హుటాహుటిన హైదరాబాద్ విచ్చేయడం సైతం దీనికి బలం చేకూరుస్తోంది. అయితే, ఎప్పటిలాగే ఈ వార్తలపై టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం తరఫున ఎలాంటి ఖండన లేదా క్లారిటీ ప్రకటన రాలేదు!