Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్, ఆయన మేనల్లుడు మంత్రి హరీశ్ రావు ఏకకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అంశాల వారీగా సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన కరోనా వ్యాక్సిన్ల అంశంలో కేటీఆర్ ప్రస్తావించగా హాట్ టాపిక్ అయిన జీఎస్టీ విషయంలో హరీశ్ రావు స్పందించారు.
కేటీఆర్ ఏమంటున్నారంటే…
కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడి చర్యల్లోనూ కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. దేశంలోని పరిస్థితుల గురించి ఆలోచించకుండా వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఇచ్చారని మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం కేంద్రం వద్దే ఉంచుకుందని పేర్కొన్న మంత్రి కేటీఆర్ 15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారని మండిపడ్డారు. వ్యాక్సిన్ల సప్లైలో నిబంధనలతో రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలు నిర్ణయించడం సరికాదని కేటీఆర్ అన్నారు.
హరీశ్ రావు ఏమంటున్నారంటే…
43వ జీఎస్టీ సమావేశంలో ఆన్లైన్ విధానంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఆల్కహాల్ ను జీఎస్టీలో చేర్చితే రాష్ట్రాలు ఆదాయం కోల్పోతాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ పరిధి నుండి శాశ్వతంగా మినహాయించేలా నిర్ణయం తీసుకోవాలని, ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలను గౌరవించాలన్నారు. సెస్ , సర్ ఛార్జీల రూపంలోనే కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వస్తోందని మంత్రి అన్నారు. అందుకే జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి ఎక్సైజ్, పెట్రోల్, డిజీల్ మాత్రమేనని మంత్రి హరీష్ రావు అన్నారు.