Harish Rao: టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన మంత్రివర్గ మాజీ సహచరుడు ఈటల రాజేందర్ కేంద్రంగా కొనసాగిస్తున్న ఆపరేషన్ను పీక్స్ కు తీసుకువెళ్లారని అంటున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ అనే పేరున్న తన మేనల్లుడు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును రంగంలోకి దింపారు. దీంతో ఈటెల నియోజకవర్గమైన హుజురాబాద్ పరిధిలోని కమలాపూర్ మండల నాయకులతో హరీశ్ రావు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సైతం ఈ సమావేశంలో ఉన్నారు.
హరీశ్ గేమ్ ప్లాన్
హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులతో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమావేశం సందర్భంగా ఈటలకు షాక్ తగిలే పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తాము తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే ఎప్పటికీ కొనసాగుతామని తెలిపారు. ఈ సందర్బంగా కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని పేర్కొన్న నేతలు క్యాడర్ అంతా టీఆర్ఎస్ తోనే ఉన్నారని ప్రకటించారు.
ఆ మాట చెప్పేశారు…
కమలాపూర్ మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అంతా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు చెప్పారు. టీఆర్ఎస్ ద్వారానే హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా సాగుతాయని నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అందుకే, తామంతా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని, ఈ విషయంలో ఇతర ఎలాంటి ఆలోచనలకు తావు లేదని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఆయనకు ఎసరు పెట్టే ప్రక్రియ జోరుగా సాగుతోందని పలువురు కామెంట్ చేస్తున్నారు.