తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసుపై సుప్రీం కోర్టు సోమవారం చేపట్టిన విచారణ అసంపూర్తిగా మాగిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై జస్టిస్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తే ఆ పార్టీ అధినేత చూస్తూ ఊరుకుంటారా.. జరిగిన కుట్రను చెప్పకూడదా అని దుష్యంత్ దవే ప్రశ్నించారు. ఈ కేసులో బీజేపీ కీలక నేతలు ఉన్నారనీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనీ, కానువ సీబీఐ విచారణ పారదర్శకంగా జరగదని పేర్కొన్నారు. దేశంలో ఉన్న ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నాయనీ, ఎనిమిది ప్రభుత్వాలను కూల్చారన్నారు. మనీష్ సిసోడియా వ్యవహారం అంతా సీబీఐ బయటకు చెబుతోందన్నారు. కేవలం ప్రతిపక్ష నేతల వెంట పడుతున్నారన్నారు. బీజేపీ నేతలను మాత్రం పట్టుకోవడం లేదని ఆరోపించారు. కేసు దర్యాప్తును ఎట్టిపరిస్థితుల్లోనూ సీబీఐకి అప్పగించవద్దని, సీబీఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పంజరంలో చిలకగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ఒక సారి సమర్ధించి మరొక సారి వ్యతిరేకించిందన్నారు. ఒక వైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా బీజేపీ నేతలు దురుద్దేశపూర్వకంగానే మరో పిటిషన్ దాఖలు చేసి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారన్నారు.
ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి వెళితే అన్ని ఆధారాలు ధ్వంసం అయిపోతాయని, కేసు పూర్తిగా నీరు గారి పోతుందని దవే కోర్టుకు తెలిపారు. ఈ వాదనల సందర్భంలో జస్టిస్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుకు సంబంధించిన పెన్ డ్రైవ్ లు జడ్జిలకు పంపడం సరైన విషం కాదన్నారు. ముఖ్యమంత్రి నేరుగా తమకు పంపడం బాగోలేదన్నారు. ఒక సామాన్యుడు చేస్తే ఎమైనా అనుకోవచ్చు కానీ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఆధ్వరంలో ఉంటే సిట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంది కదా అని ప్రశ్నించారు. జడ్జీలకు సీఎం కేసిఆర్ కేసు వీడియోల పెన్ డ్రైవ్ లు పంపడంపై ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. కోర్టు సమయం ముగియడంతో వాదనలను నిలిపివేసింది ధర్మాసనం. ప్రభుత్వం తరపు వాదనలు విన్న ధర్మాసనం.. కేసును సీజేఐ ధర్మాసనానికి రిఫర్ చేసింది. తదుపరి విచారణపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. దీంతో తదుపరి విచారణపై సందిగ్దత నెలకొంది.
ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురు.. అమరావతి పిటిషన్లపై మార్చి 28న విచారణ