Huzurabad By Poll: హూజూరాబాద్ నియోజకవర్గంలో మరో 11 రోజుల్లో ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో మొత్తం 30 మంది అభ్యర్ధులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ అధికార టీఆర్ఎస్, ఈటల రాజేందర్ మధ్య ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హోరా హోరీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్ధిగా రంగంలో ఉండగా అధికార టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్ధిగా వెంకట్ బల్మూరు ఉన్నారు. అయితే హూజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే కేసిఆర్ సర్కార్ ప్రతిష్టాత్మంగా దళితుల అభ్యున్నతికి దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తొలుత ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు. ఈ పథకం కింద దళితుల కుటుంబాలకు పది లక్షల నగదు అందజేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేసిఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారనీ, దళితుల పై చిత్తశుద్ది ఉంటే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటూ వివిధ రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో కేసిఆర్ ఇటీవల దళిత బంధు పథకంపై వివిధ రాజకీయ పక్షాల తో సమీక్షా సమావేశం నిర్వహించి అయిదు జిల్లాల్లోని ఎస్సీ నియోజకవర్గాల్లోనూ రెండవ విడత పంపిణీకి చర్యలు చేపట్టారు.
Read More: Tolly wood: అందరూ పెద్దలే..! ఎవరి మాటలు ఎవరు వింటారు..? దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కీలక వ్యాఖ్యలు.!
Huzurabad By Poll: ఈసీ కీలక ఆదేశాలు
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. హూజారాబాద్ లో ఎన్నికల పూర్తి అయ్యే వరకూ దళిత బంధు పథకాన్ని నిలుపుదల చేయాలని పేర్కొంది. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా ఈ పథకాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈసీ. నియోజకవర్గంలో ఓటర్ల ను ప్రలోభపెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ పలు పార్టీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. దీనిపై ఈసీ స్పందించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఓటర్లు ప్రలోభాలకు లోను కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది.
దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం
దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఇంత వరకూ ఇటువంటి పథకాన్ని దళితుల అభ్యున్నతి కోసం పథకాన్ని ప్రవేశపెట్టలేదు. ఈ పథకం ద్వారా నిరుపేద దళితులకు పది లక్షల ఆర్ధిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి కల్పన కోసం 30 రకాల స్వయం ఉపాధి వ్యాపారాలను ఈ పథకం ద్వారా నిర్వహించుకోవచ్చు. ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సర్వేలు జరిపి మినీ డెయిరీ యూనిట్ మొదలు కొని మినీ సూపర్ బజారు వరకూ వివిధ రకాల స్వయం ఉపాధి కార్యక్రమాలను ఇందులో పొందుపర్చింది ప్రభుత్వం.