తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో నిన్నరాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించి ల్యాప్ టాప్ లు, సీపీయూలు స్వాధీనం చేసుకోవడం తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అయితే ఈ సోదాలకు సంబందించి హైదరాబాద్ అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
మాదాపూర్ లోని మైండ్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ కార్యాలయంలో చలా రహస్యంగా అఫీసు పెట్టి నడుపుతున్నారనీ, గత ఆరు నెలలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ చెప్పారు. ఈ కార్యాలయం నుండి మహిళలపై అసభ్య పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. కార్యాలయంలో సోదాలు చేసిన తర్వాత మెండా శ్రీప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మ ను అదుపులోకి తీసుకుని విచారించగా, వీరు సునీల్ కనుగోలు కింద పని చేస్తున్నారని చెప్పారన్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్ కనుగోలు ను ప్రధాన నిందితుడుగా దృవీకరించడం జరిగిందన్నారు.
నిన్నటి వరకూ అసభ్య పోస్టులు ఎవరు చేస్తున్నారనే విషయం ఎవరికీ తెలియదనీ, వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో కార్యాలయం నడుస్తున్నట్లుగా తెలిసిందన్నారు అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్. ప్రస్తుతం సునీల్ కనుగోలు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదనీ, నోటీసులు మాత్రమే ఇచ్చామని తెలిపారు. మైండ్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ పేరుతో కార్యాలయం రిజిస్టర్ చేశారనీ, ఏ పొలిటికల్ పార్టీ పేరుతో రిజిస్టర్ కాలేదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం సహజమని, అయితే ముఖ్యంగా రాజకీయాల్లో విమర్శలు ఆరోగ్యకరంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు.
కానీ ఒక వ్యక్తిని టార్గెట్ గా చేయడం, ముఖ్యంగా మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా సామాజిక మాథ్యమాల్లో పోస్టులు పెట్టడం విమర్శ కిందకు రాదని అన్నారు. నగరంలో వివిధ పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకూ అసభ్య పోస్టులకు సంబంధించి అయిదు కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. నిన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారికి 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసి పంపించి వేశామన్నారు. సోదాల్లో పది ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, సీపీయూలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో పూర్తిగా చట్టప్రకారమే దర్యాప్తు కొనసాగుతోందని అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ తెలియజేశారు.