Hyderabad Gang Rape Case: హైదరాబాద్ లో ఇటీవల జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు తీరు సరిగా లేదు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసి వీడియో, ఫోటో సాక్షాలను మీడియా సమావేశంలో బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన పై కేసు నమోదు అయ్యింది. జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో బాలిక ఫోటోలు, వీడియోలు విడుదల చేశారని ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘునందనరావుపై కేసు దాఖలైంది. రఘునందనరావుపై ఐపీసీ 228 (ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Hyderabad Gang Rape Case: ఓ న్యాయవాది ఫిర్యాదుతో
రఘునందనరావు ఇటీవల మీడియా సమావేశంలో జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు, ఫోటోలను మీడియా ముందు బయటపెట్టారు. తమ వద్ద మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయనీ, వాటిని పోలీసులకు, న్యాయస్థానానికి అందజేస్తానని ఆ సమావేశంలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బాలిక ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. ఆ ఫోటోల్లో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారని రఘునందనరావు ఆరోపించారు. తొలుత పోలీసులే రఘునందనరావుపై సుమోటో కింద కేసు నమోదు చేయాలని భావించారనీ, న్యాయనిపుణులను సైతం సంప్రదించారని వార్తలు వచ్చాయి. కానీ ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
Hyderabad Gang Rape Case: అంతకు ముందు జర్నలిస్ట్ పై
ఇదే కేసులో గ్యాంగ్ రేపు బాధితురాలికి సంబంధించి వివరాలను విడుదల చేసిన జర్నలిస్ట్ సుభాన్ పై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే రఘునందనరావు బాధిత బాలిక ఫేస్ ను బయటపెట్టలేదనీ, కేవలం మేజర్ గా ఉన్న ఎమ్మెల్యే కుమారుడు ప్రమేయంపైనే వీడియో విడుదల చేశాననీ, తనకు లభించిన ఆధారాలను బయటపెట్టారని బీజేపీ నేతలు అంటున్నారు. కాగా తొలుత ఈ కేసులో దర్యాప్తులో ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్ల ల పాత్ర మాత్రమే ఉందని గుర్తించి కేసు నమోదు చేసిన పోలీసులు, రఘునందనరావు ఫోటోలు, వీడియోలు బయట పెట్టిన తరువాత ఎమ్మెల్యే కుమారుడిని కేసులో ఏ 6గా చేర్చారు.